KTR Counter to Pawan Kalyan: తెలంగాణపై పవన్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్.. “మాకు దేశభక్తి నేర్పాల్సిన అవసరం లేదు”

KTR Counter to Pawan Kalyan

KTR Counter to Pawan Kalyan

జనసేన, తెలంగాణ రాజకీయాలపై స్పందించిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వ అప్పులు, హామీల అమలుపై కూడా విమర్శలు

ది డిజిటల్ బ్రీఫ్ 

హైదరాబాద్, జూన్ 03, 2026:

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాజకీయాలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. దేశంలో ఎవరైనా పార్టీ పెట్టవచ్చని, ఎక్కడైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని పేర్కొన్న ఆయన, అయితే ఏ ప్రాంతంలో రాజకీయాలు చేయాలనుకుంటే ఆ ప్రాంత చరిత్ర, పోరాటాలు, ప్రజల భావోద్వేగాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

పవన్ కళ్యాణ్ తెలంగాణలో జనసేన విస్తరణపై చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి కేటీఆర్ స్పందిస్తూ, “జనసేన కొత్తగా తెలంగాణలో పోటీ చేసేదేముంది? 2023 ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే సభ పెట్టాల్సిన అవసరం ఏముంది?” అని ప్రశ్నించారు.

“తెలంగాణ భూమిపుత్రుల జాగీరే”

తెలంగాణ రాష్ట్రం ముమ్మాటికీ తెలంగాణ ప్రజలదేనని కేటీఆర్ స్పష్టం చేశారు. అదే సమయంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఉద్యమానికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

“ప్రాంతీయ భావనలను అర్థం చేసుకోవాలి. కానీ మేము ఎప్పుడూ ఇతర ప్రాంతాల ప్రజలకు వ్యతిరేకం కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కూడా మద్దతు ఇచ్చాం” అని అన్నారు.

దేశభక్తిపై పవన్ వ్యాఖ్యలకు స్పందన

ప్రాంతీయవాదం కంటే ఉగ్రవాదం ప్రమాదకరమని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్, తెలంగాణ ఉద్యమాన్ని ప్రాంతీయవాదంతో పోల్చడం సరైనది కాదన్నారు.

“మద్రాస్ రాష్ట్రం నుంచి ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేశారు. అది కూడా ప్రాంతీయవాదమేనా? తెలంగాణ కోసం జరిగిన ఉద్యమం ప్రజాస్వామ్య పోరాటం. మాకు దేశభక్తి గురించి పవన్ కళ్యాణ్ నేర్పాల్సిన అవసరం లేదు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ అప్పులపై విమర్శలు

ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కూడా కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.

“మాట్లాడితే కేసీఆర్ అప్పులు చేసి వెళ్లాడని అంటున్నారు. కానీ ఒక్కో మంత్రి ఒక్కో లెక్క చెబుతున్నారు. కేబినెట్‌లో మంత్రులకు శృతి లేదు, లయ లేదు. మా పదేళ్ల పాలనలో మొత్తం రూ.2.80 లక్షల కోట్ల అప్పులు మాత్రమే చేశాం. ఇప్పుడు రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు” అని అన్నారు.

“రెండేళ్లలోనే రూ.4 లక్షల కోట్ల అప్పు”

కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలోనే సుమారు రూ.4 లక్షల కోట్ల అప్పు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. భూముల వేలం ద్వారా భారీ ఆదాయం వస్తోందని ప్రభుత్వం చెబుతోందని, ఆ నిధులు ఎక్కడ ఖర్చవుతున్నాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

“ఎకరం భూమి రూ.200 కోట్లకు అమ్ముడవుతోందని చెబుతున్నారు. ఆ డబ్బులు ఏం చేస్తున్నారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి” అన్నారు.

“కేసీఆర్ హయాంలో ఆర్థిక విప్లవం”

తెలంగాణ అభివృద్ధిపై మాట్లాడిన కేటీఆర్, మాజీ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని పేర్కొన్నారు.

“కాంగ్రెస్, బీజేపీలకు సవాల్ విసురుతున్నా. కేసీఆర్ హయాంలో తెలంగాణ సాధించిన అభివృద్ధి కంటే ఎక్కువ అభివృద్ధి జరిగిన రాష్ట్రాన్ని చూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా” అని సవాల్ విసిరారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పిస్తూ, “రెండున్నరేళ్ల పాలనలో ఏ రంగం చూసినా డౌన్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారు” అని ఆరోపించారు.

ఆరు గ్యారెంటీలపై ప్రశ్నలు

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై కూడా కేటీఆర్ ప్రశ్నలు లేవనెత్తారు.

“100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు 30 నెలలు దాటినా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. అప్పుడు ప్రజలు మిమ్మల్ని ఏమనాలి?” అని ప్రశ్నించారు.

రాజకీయంగా వేడెక్కిన తెలంగాణ

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, కేటీఆర్ కౌంటర్లతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. జనసేన తెలంగాణలో విస్తరణపై స్పష్టమైన సంకేతాలు ఇస్తుండగా, బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ ఆత్మగౌరవ అంశాన్ని ముందుకు తీసుకువస్తోంది. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *